మణిపూర్ కి మద్దతుగా నియోకర్సర్ విద్యార్థుల క్యాండిల్ ర్యాలీ

నవతెలంగాణ ముషీరాబాద్ : మణిపూర్ లో మతోన్మాద హింసను ఎదుర్కొంటున్న అభాగ్యుల తరఫున, వారికి మద్దతు తెలియజేస్తూ నియోకర్సర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. “హింసను ఆపండి మణిపూర్ ను కాపాడండి” అనే నినాదాలతో సుందరయ్య పార్క్ చుట్టూత ప్లకార్డులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు చూసి తమ మనసు కలత చెందిందన్నారు ఇంతటి దారుణాన్ని 180 రోజులుగా అక్కడి ప్రజలు ఎలా అనుభవిస్తున్నారోనని ఆవేదనను, ఆందోళనను వ్యక్తం చేశారు. బాధితులకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ చేయాలని స్వచ్ఛందంగా తీర్మానించుకున్నామన్నారు. నియోకర్సర్ డైరెక్టర్ బొజ్జ బిక్షమయ్య విద్యార్థుల స్వచ్ఛంద మద్దతును అభినందించారు. మానవ విలువలు పతనమైనప్పుడల్లా, మానవత్వానికి విఘాతం కలిగినప్పుడల్లా నిజమైన దేశభక్తులు కుల, మత ప్రాంతాలకతీతంగా ఈ విధంగానే స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. మతోన్మాదం నెత్తికెక్కిన శక్తులు మణిపూర్లో సృష్టిస్తున్న దురాగాతాలను దేశమంతా ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోకర్సర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జగదీష్, కోఆర్డినేటర్ ఇందిరా, నాలెడ్జ్ సెంటర్ బాధ్యులు ఉమారాణి, సాత్విక, టీ 10 సీఈఓ సుందర్ తదితరులు పాల్గొన్నారు.
పివైఎల్ ఆధ్వర్యంలో రాంనగర్ లో నిరసన
మణిపూర్ లో కుక్కి గిరిజన తెగకు చెందిన ముగ్గురు మహిళలను వివస్త్రను చేసి, ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన అల్లరి అల్లరి మూకలను కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల యువజన సంఘం ( పి.వై.ఎల్) , తెలంగాణ ప్రగతిశీల భవన & ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాంనగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు.. ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్ ప్రదీప్, తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం గ్రేట్ హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు కోలా నల్లన్న, రాందాస్, పి.వై.ఎల్ నాయకులు రవికుమార్, భూషణవేణి కృష్ణ, నాయకులు రాజు, వెంకటేష్, శ్రీనివాస్, మల్లేష్, మహదేవ్, ఆంజనేయులు, నాగేష్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love