16న జరగనున్న కార్మికుల సమ్మె- గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయండి


నవతెలంగాణ – చండూరు: కేంద్ర ప్రభుత్వం, ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. గురువారం చండూరు మండల కేంద్రంలో చండూరు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ చండూరు మండల పరిషత్ సూపర్డెంట్ మనోహర్, ఏపీవో స్వరూపారాణికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మాట్లాడుతూ దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలకు కట్టు బానిసలాగా పనిచేస్తూ కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పుతూన్నారని ఆరోపించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులలో లక్షల కోట్ల రుణాలు తీసుకున్నటువంటి విజయ్ మాల్యా, నీరో మోడీ, లలిత్ మోడీ ఇలా అనేకమంది 12 లక్షల కోట్ల బ్యాంక్ రుణాలను కరోనా కాలంలో మాఫీ చేస్తూ వారికి ఊరటను ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి కార్మిక వ్యవసాయ కార్మికులకు రైతులకు మొండి చెయ్యి చూపించిందని అన్నారు. రాబోయే ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి ఎలా రావాలని ఎత్తుగడలో భాగంగా దేశంలో మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూ లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ రైతులు కార్మికులు వ్యవసాయ కూలీల ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఈ చర్యలను వెనక్కి కొట్టాలంటే దేశంలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాట స్ఫూర్తితో నేడు కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు ఆదివాసీలు కలిసి కేంద్ర ప్రభుత్వ తీరుపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. జయప్రదం కోసం అన్ని యూనియన్ల గ్రూప్ మీటింగ్స్, కరపత్రాల పంపిణీ, సంతకాల సేకరణ ద్వారా ప్రజల్లో విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు మొగుదాల వెంకటేశం, చిట్టిమల్ల లింగయ్య, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) మండల అధ్యక్షులు నాంపల్లి శంకర్, మండలప్రధాన కార్యదర్శి ముంత వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Spread the love