నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఆదివారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్పోర్టు ప్రహరీ నుంచి అది దూకినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్పోర్టు కంట్రోల్ రూమ్లో అలారం మోగింది. దీంతో అక్కడి భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరించినట్లు తేలింది. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎయిర్పోర్టు పరిసరాల్లోకి చేరుకున్న అటవీ సిబ్బంది.. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు.