– పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ – ఆలేరు రూరల్
సమాజ సేవలో యువతకు ఆదర్శంగా డాక్టర్ చిలుకు స్వామి నిలుస్తున్నారని దళిత–బహుజన వర్గాల ఆశాజ్యోతి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసిన ప్రతిష్టాత్మక “శ్రమ శక్తి అవార్డు” అందుకున్న సందర్భంగా డాక్టర్ చిలుకు స్వామి, పద్మశ్రీ మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ప్రముఖ నాయకులు, సహచరులు కలిసి డాక్టర్ చిలుకు స్వామిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ…“2009లో తమ్ముడు ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ మన జాతి అభ్యున్నతి కోసం ముఖ్యంగా మాదిగ విద్యార్థుల హక్కులు, భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేశాడు.విద్యార్థి దశ నుంచే సమాజ సేవ పట్ల అంకితభావంతో పనిచేసిన డాక్టర్ చిలుకు స్వామి నేడు శ్రమ శక్తి అవార్డు అందుకోవడం ఎంతో గర్వకారణం. భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి సమాజానికి ఇంకా గొప్ప సేవలు చేయాలని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.


