రంజాన్ ప్రార్థనల కోసం తెరుచుకున్న చర్చి గేట్లు

– ఇదీ నిజమైన ‘కేరళ స్టోరీ’

నవతెలంగాణ మలప్పురం: రంజాన్ పండుగ సందర్భంగా మతసామరస్యం వెల్లివిరిసింది. కేరళలోని మలప్పురం జిల్లా మంజేరి పట్టణంలో ఉన్న నికోలస్ మెమోరియల్ సీఎస్ఐ చర్చి ముందున్న విశాలమైన మైదానంలో ఈద్ ప్రార్థనల కోసం చర్చి గేట్లు తెరుచుకున్నాయి.

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులను ప్రార్థనలు చేసుకునేందుకు ఆహ్వానిస్తూ బుధవారం చర్చి అధికారులు గేట్లు తెరిచారు. పట్టణ ముస్లింలు స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఈద్ ప్రార్థనలు చేసుకునేవారు. లోక్ సభ ఎన్నికల కారణంగా పాఠశాల మూతపడింది. దీంతో ఈద్ ప్రార్థనలకు గేట్లు తెరవాలని చర్చి పెద్దలు నిర్ణయించి ముస్లిం ప్రముఖులకు తెలియజేయడంతో ఆ ప్రాంగణం మత సామరస్యానికి వేదికగా మారింది. చర్చి ఆవరణలో రంజాన్ ప్రార్థనలు చేసేందుకు వందల సంఖ్యలో ముస్లిం సోదరులు విచ్చేసిన దృశ్యం కనువిందు చేసిందని, ఇదీ నిజమైన ‘కేరళ స్టోరీ’ అని నెటిజన్లు అభినందించారు.

Spread the love