నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఐకేపీ వీఓఏలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ అనుబంధం) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐకేపీ వీఓఏలకు కనీస వేతనం రూ.18 వేలు ఇస్తామనీ, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా డిమాండ్లను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ మాట్లాడుతూ.. మహిళా సంఘాల పనులే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్నిరకాల సంక్షేమ పథకాలను వీఓఏలు విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. వీఓఏలకు సెర్ప్ నుంచి కేవలం ఐదువేల రూపాయల గౌరవ వేతనం మాత్రమే అందుతున్నదనీ, దాంతో ఒక కుటుంబం ఎలా గడుస్తుంది? అని ప్రశ్నించారు. ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం యూనియన్ గౌరవాధ్యక్షులు ఎస్వీ. రమ మాట్లాడుతూ 20 ఏండ్ల నుంచి గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల ఏర్పాటులో, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సభ్యులు సకాలంలో రుణాలు చెల్లించేలా ప్రోత్సహిస్తున్నారన్నారు. వీఓఏల మీద ఏపీఎంలు, సీసీలు ఒత్తిడ ిలకు గురి చేస్తూ పని భారం మోపుతున్నారని వాపోయారు. గ్రేడింగ్ పేరుతో జీతాలు రాకుండా ఆపేస్తున్నారనీ, ఇది సరైంది కాదని చెప్పారు. సెర్ప్తో సంబంధం లేని పనులు వారితో చేయించవద్దనీ, వారి న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు సుమలత, సుధాకర్, అంజి, వెంకటయ్య, రమేష్, వసియా బేగం, జ్యోతి, శోభారాణి, శరత్కుమార్, దుర్గయ్య, సీఐట ీయూ నాయకులు లకీëనారాయణ, రాజేందర్, కవిత తదితరులు పాల్గొన్నారు.