కర్ణాటక ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

నవతెలంగాన – అమరావతి: కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మంది దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… మరో ఏడుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. దట్టంగా ఉన్న పొగమంచే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘోర ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని అన్నారు. ప్రమాదంలో గాయపడి విషమంగా ఉన్న మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నామని వెల్లడించారు.

Spread the love