నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ ఏర్పాటు చేసే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్(మానవ వనరుల కేంద్రం)కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో నిర్మించనున్న భారీ భవనానికి సీఎం భూమిపూజ నిర్వహించారు. పార్టీ నేతలకు శిక్షణ, సంబంధిత కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఈ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చండీహోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు కె. కేశవరావు, వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు.