నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికీ, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని సీఎం కేసీఆర్ అన్నారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. సర్వాయి పాపన్న జయంతి ( ఆగస్టు 18) సందర్భంగా వారి కృషిని, పోషించిన చారిత్రక పాత్రను సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాడడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ స్వయం పాలనలో సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించామనీ, స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా పాపన్నగౌడ్ ఆశయాలను అమలు చేస్తున్నామని సిఎం కేసీఆర్ తెలిపారు.