బతుకమ్మ సంబురాలకు భారత జాగృతి సన్నాహాలు

– గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బతుకమ్మ సంబరాలకు భారత్‌ జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో సోమవారం విడుదల చేశారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్‌, సౌమ్యతోపాటు భారత్‌ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్‌ కోడారి శ్రీనుతో కలిసి కవిత పాట పాడడం వీడియోలో కనిపించింది. ఆ యాప్‌లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ పాటలు ఉన్నాయి. ప్రజల సహకారంతో అరుదైన , ప్రాచీన, కొత్తగా పూర్తి చేసిన బతుకమ్మ పాటలను సేకరిస్తోంది. అలాంటి పాటలను భారత్‌ జాగృతితో పంచుకోవడం కోసం ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ కూడా కేటాయించింది. 89856 99999 నెంబర్‌కి వాట్సాప్‌ ద్వారా ఆ పాటలను పంపించాలని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. అంతేకాక తమకు ఇష్టమైన బతుకమ్మ పాటలను సామాజిక మాధ్యమాల్లో భారత్‌ జాగృతికి ట్యాగ్‌ చేస్తూ పోస్టులు చేయాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ పాటలు సేకరణ, రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించిన భారత్‌ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్‌ కొడారి శ్రీనును ఆమె అభినందించారు.

Spread the love