– ఏ.ఐ.ఎస్. బి., నిజామాబాద్ జిల్లా కన్వీనర్ పి.గజానంద్
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు వివిధ పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ,ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు దోపిడిని అరికట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ (AISB) నిజామాబాద్ జిల్లా కన్వీనర్ పి. గజానంద్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ రకాల తోక పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ, ధనార్జనే ధ్యేయంగా నిజామాబాద్ జిల్లాలోకి నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ మరియు ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టగొడుగుల పుట్టుకొచ్చి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఓకే పేరుమీద వివిధ రకాల విద్యాసంస్థలను నడిపిస్తూ, ప్రభుత్వ అనుమతులు లేకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన తెలిపారు. కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల పైన విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్క విద్యా సంస్థను తనిఖీలు చేస్తూ నిబంధనలు పాటించని విద్యాసంస్థలపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆలిండియా స్టూడెంట్ బ్లాక్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రతి విద్యా సంవత్సరంప్రారంభంలో విద్యార్థి సంఘాలుగా విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు వినతిలు వస్తున్నప్పటికీ కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల పట్ల విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా ఎలాంటి ఫ్యాకల్టీ లేకున్నా లక్షల రూపాయల ఫీజులు దండుకుంటూ పుట్టగొడుగుల ఇవే విద్యాసంస్థలు వివిధ రకాల పేర్లతో కోచింగ్ సెంటర్లను కూడా నడుపుతున్న అధికారులు అటువైపు చూడడం లేదని ఆయన అన్నారు. విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి సౌకర్యాలు కల్పించని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పైన కోరాడ జూలిపించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు.