– రూ.4.35 కోట్ల విలువైన క్యాన్సర్ నివారణ మందులు స్వాధీనం :కమలాసన్ రెడ్డి
– పరారీలో నకిలీ మందుల తయారీ కంపెనీ యజమాని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నకిలీ మందుల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రాష్ట్ర చరిత్రలోనే క్యాన్సర్ నివారణకు ఉపయోగించే అతిపెద్ద నకిలీ మందుల తయారీ దారులను హైదరాబాద్ లోని మచ్చ బొల్లారంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. వీరి నుంచి దాదాపు రూ.4.35 కోట్ల విలువైన నకిలీ క్యాన్సర్ నివారణ మందులను స్వాధీన పర్చుకున్నామని డ్రగ్స్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ జనరల్ వీ.బీ. కమలాసన్ రెడ్డి వెల్లడించారు. ఆస్ట్రిక హెల్త్ కేర్ అనే కంపెనీ క్యాన్సర్ నివారణ కు ఉపయోగించే మందులకు సంబంధించి నకిలీ మందులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో ఈ నెల 2న డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి చెందిన విజిలెన్స్ ప్రత్యేక బృందాలు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించాయి. ఈ నకిలీ మందుల చలామణికి సంబంధించిన ఇన్వాయిస్ల ద్వారా పోస్టల్ శాఖ ద్వారా కంపెనీ చిరునామా కోసం ఆల్వాల్లో వెతకగా అది తప్పుడు చిరునామాగా నిర్దారణ అయింది. అనంతరం, ఐడీఏ చర్లపల్లి, నాచారం, మేడ్చల్లోని వివిధ కొరియర్ కార్యాలయాలను తనిఖీ చేసి ఆస్ట్రికా హెల్త్ కేర్ ద్వారా పంపిణీ అయిన వాటిని తనిఖీ చేశారు. డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి చెందిన విజిలెన్స్ ప్రత్యేక బృందం కీసరలోని ఆస్ట్రికా హెల్త్ కేర్ సంస్థపై దాడులు నిర్వహించింది.
‘ఆస్ట్రికా హెల్త్కేర్’ ప్రాంగణం నుంచి నకిలీ డ్రగ్ స్టాక్ డెలివరీ చేస్తున్న కొరియర్ బారుని డీసీఏ అధికారులు గుర్తించారు. మచ్చ బొల్లారం వద్ద మూడు షట్టర్లలో ఈ నకిలీ మందులు నిల్వ చేసి ఉన్నాయి. డిసెంబర్ 4న ఈ నకిలీ మందుల తయారీ లొకేషన్ పై దాడి చేసి రూ.4.35 కోట్ల విలువైన 36 రకాల క్యాన్సర్ నివారణ మందులు, ఇతర మందులను స్వాధీనం చేసుకున్నారు. మందుల లేబుల్స్ ఉనికిలో లేని కంపెనీ ‘ఆస్ట్రా జెనెరిక్స్ ప్రయివేటులిమిటెడ్’ వివరాలను కలిగి ఉన్నాయి. ఇవి 2021జూలైలో వీరి లైసెన్సులు ఇప్పటికే రద్దు చేయబడ్డాయి, కానీ తయారీ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్పై తేదీ మార్చి-2023 పేరుతో పేర్కొనడం గమనార్హం.
వీటితో వినాశనకర పరిణామాలు….
నకిలీ మందులు ప్రజారోగ్యానికి ముప్పు కలిగించడమే కాకుండా రోగికి కాలక్రమేణా, వినాశకరమైన పరిణామాలను సృష్టిస్తుందని కమల హాసన్ రెడ్డి తెలిపారు. ఈ నకిలీ క్యాన్సర్ మందులకు సంబంధించిన రహస్య కార్యకలాపాలను గుర్తించి, స్వాధీనం చేసుకోవడం రాష్ట్రంలోనే అతిపెద్ద ఘటన అని వెల్లడించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆస్ట్రికా హెల్త్కేర్ డైరెక్టర్ కె. సతీష్ రెడ్డి పరారీలో ఉన్నాడనీ, అతన్ని వెతుకుతున్నామని తెలిపారు.
ప్రత్యేక బృందంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ పి. రాము నేతృత్వంలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు జి. శ్రీకాంత్, కె. అన్వేష్, ఎం. చంద్రశేఖర్, వి.అజయ్, ఎస్.వినరు సుష్మీ నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారని ఆయన వెల్లడించారు.
పట్టుబడిన డ్రగ్స్లో కింది కంపెనీల పేర్లు
1) ఆస్ట్రా జెనరిక్స్ ప్రయివేటు లిమిటెడ్, తెలంగాణ
2) ఆస్ట్రికా హెల్త్కేర్ ప్రయివేటు లిమిటెడ్, తెలంగాణ
3) మీడియన్ బయోటెక్ ప్రయివేటు లిమిటెడ్, హిమాచల్ ప్రదేశ్
4) అలయన్స్ బయోటెక్, హిమాచల్ ప్రదేశ్
5) సన్వెట్ హెల్త్కేర్, హిమాచల్ ప్రదేశ్,
6) సాలస్ ఫార్మాస్యూటికల్స్, హిమాచల్ ప్రదేశ్
7) డీఎం ఫార్మా ప్రయివేటు లిమిటెడ్, హిమాచల్ ప్రదేశ్
8) సేఫ్ పేరెంటరల్స్ ప్రయివేటు లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్
9) బ్లెస్ ఫార్మా ఇండియా ప్రయివేటు లిమిటెడ్ , తెలంగాణ