మహాదేవ్‌ యాప్‌ పేరిట కాంగ్రెస్‌ అవకతవకలు

–  కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహాదేవ్‌ యాప్‌ పేరిట కాంగ్రెస్‌ పార్టీ ఆర్థిక అవకతవకలకు పాల్పడు తున్నదని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ప్రతి ఒక్కరి నెంబర్‌ వస్తుందనీ, అప్పుడు వాళ్లు కూడా జైలుకు వెళ్లాల్సిందేనని ఎమ్మెల్సీ కవితనుద్దేశించి అన్నారు. తెలంగాణ సర్కారు గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందనీ, ఆ ప్రాజెక్టు బిగ్గెస్ట్‌ ఇంజినీరింగ్‌ బ్లండర్‌ అని విమర్శించారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శని వారం హైదరాబాద్‌కు వచ్చారు. రాజా సింగ్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హోటల్‌ కత్రియాలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా తాను బ్యాట్‌ మెన్‌గా వచ్చాననీ, బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎంతో దోచుకున్నాయని ఆరోపించారు.
రాజస్థాన్‌ సచివాలయ ంలో కోట్లు, కిలోల కొద్దీ బంగారం దొరకడమే దానికి నిదర్శనమన్నారు. విదేశాల నుంచి కూడా ఆ పార్టీకి డబ్బులు వస్తున్నాయనీ, మహాదేవ్‌ యాప్‌ పేరిట రూ.508 కోట్లు ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భాగేల్‌ కు అందాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ గ్యారెంటీలు వర్కవుట్‌ కావట్లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ ఆలస్యంతో ఎంతోమంది మరణించారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ మంచి చేస్తారనుకుంటే నిరు ద్యోగులను మోసం చేశారని ఆరోపిం చారు.
కేసీఆర్‌ జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్‌ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచిందని విమర్శించారు. లిక్కర్‌ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారనీ, తప్పు చేసిన వారె వ్వరూ తప్పించుకోలేరని చెప్పారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరివార్‌ సర్వీస్‌ కమీషన్‌గా మారిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. హామీలన్నీ విస్మరిం చారని విమర్శించారు.

Spread the love