– హాజరైన ఏడీఏ పెంటేల రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని అనంతారం క్లస్టర్ పరిధి రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియా యాప్ వినియోగం, ప్రకృతి వ్యవసాయం, సన్న రకాల వరి సాగుపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు పి. రవికుమార్ మాట్లాడుతూ రైతులు యూరియా యాప్ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. యాప్ ద్వారా లభించే సేవలు, ప్రయోజనాలను వివరించారు.
మండలంలో ప్రస్తుతం 4,068 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో నారాయణపురం సొసైటీలో 2,438 బస్తాలు, అశ్వారావుపేట పేట సొసైటీలో 344 బస్తాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద 1,294 బస్తాలు నిల్వ ఉన్నాయని చెప్పారు. రైతులు యాప్ ద్వారా యూరియాను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని సూచించారు. పట్టాదారు పాసుబుక్ లేని రైతులు పహాణి ఆధారంగా వ్యవసాయ శాఖ అధికారుల వద్ద నమోదు చేసుకుని మొబైల్ నంబర్ ద్వారా యాప్లో బుకింగ్ చేసుకోవచ్చన్నారు.
నాబార్డ్ ప్రతినిధి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతుల ద్వారా పంటల సాగు చేపట్టడం వల్ల భూసార పరిరక్షణతో పాటు ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయని తెలిపారు.
మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాస్ మాట్లాడుతూ సన్న రకాల వరి సాగు, ప్రస్తుత ఎల్నినో పరిస్థితులు, వాటి ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, సాగు యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనూష దేవి, వ్యవసాయ విస్తరణ అధికారులు షకీరా భాను, సతీష్, రవీంద్రరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



