
– పామాయిల్ పంట సాగు రైతులకు రుణాలు అందించాలి
– జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్ : జిల్లాలో పంట రుణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్.డి.ఎం. సి.హెచ్. బాపూజీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన డి.సి.సి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంక్ అధికారులు అర్హులైన రుణ లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించాలని సూచించారు. జిల్లాలో పామాయిల్ పంట సాగు చేసే రైతులకు పంట రుణాలు అందించాలని అలాగే జిల్లాలో 3600 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగులో ఉందని ఈ సంధర్బంగా వివరించారు. త్వరలో అన్ని సెక్టార్ లలో పంట సాగు అనే అంశం పై రైతులు, బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఉద్యాన అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 26 స్థానిక జూనియర్ కళాశాలలో ఫైనాన్స్ లిట్రాసి క్యాంప్ నిర్వహణ సందర్బంగా ఫిబ్రవరి 26న అలాగే మార్చి 3న కలెక్టరేట్ లో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఆర్ధిక సంవత్సరం లో పంట ఋణాల్లో 2614.67 లక్ష్యం కాగా 9 నెలల్లో ఇప్పటివరకు 2567.55 కోట్ల రుణాలు అందించామని 98 శాతం వృద్ధి సాధించడం జరిగిందని అలాగే వ్యవసాయ టర్మ్ లోన్స్ లక్ష్యం 1363.93 కోట్ల లక్ష్యం ఉండగా ఇప్పటివరకు 1416.43 కోట్ల రుణాలు అందించి 103.85 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. మొత్తంగా వ్యవసాయ ఋణాల్లో 3978.6 కోట్లు లక్ష్యం కాగా 3983.98 కోట్ల రుణాలు ఇప్పటివరకు రైతాంగానికి అందించగా మొత్తంగా 100.14 శాతం వృద్ధి సాధించామని అన్నారు. అదేవిదంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు 457.47 కోట్ల లక్ష్యం కాగా ఇప్పటివరకు 802.2 కోట్ల రుణాలు అందచేసామని 175.36 శాతం వృద్ధి సాధించామని, ఇతర సెక్టార్ లలో 377.59 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటివరకు 1294.06 కోట్లతో రుణాలు అందించామని అన్నారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించే దిశగా 589.52 లక్ష్యం కాగా ఇప్పటివరకు 526.58 కోట్లలో రుణాలు అందచేసామని 89 శాతం వృద్ధిలో సాదించామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ బ్యాంకు ల ద్వారా అందించిన రుణాల పై బ్యాంక్ అధికారులతో సమీక్షించారు. రుణాల మంజూరులో బ్యాంకులు ముందంజలో ఉన్నందుకు బ్యాంక్ అధికారులను ఈ సందర్బంగా అభినందించారు. తదుపరి 2024-25 సంవత్సరానికి నాబార్డ్ వార్షిక ప్రణాళిక బుక్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో ఆర్.బి.ఐ ఎల్.డి.ఓ వైభవ్ వ్యాస్, ఎస్ బి ఐ ఎ.జి.ఎం. జ్యోతి, నాబార్డ్ జి.ఎం. సత్యనారాయణ, ఏపీజీవీబీ ఏ.జి.ఎం. ఆశాలత, పి.డి. కిరణ్ కుమార్, ఎ.డి.ఎ రామారావు నాయక్, జి.ఎం. పరిశ్రమలు తిరుపతయ్య, డి ఇ ఒ అశోక్, సంక్షేమ అధికారులు జ్యోతి పద్మ, మాధవ రెడ్డి, శంకర్ వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.