మనస్తాపంతో కూతురి ఆత్మహత్యాయత్నం

– ఆందోళనతో తండ్రి..మృతి, తండ్రి కూతురి పరిస్థితి విషమం
నవతెలంగాణ-నడికూడ
ఇంటర్‌ పరీక్షలో ఒక సబ్జెక్టు తప్పిన కుమార్తెను తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. తీవ్ర ఆందోళనకు గురైన తండ్రి కూడా పురుగుల మందు తాగాడు. దీంతో తండ్రి మృతిచెందాడు. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా నడికుడ మండలంలోని రామకృష్ణాపురం సోమవారం జరిగింది. దామెర ఎస్‌ఐ కొంక అశోక్‌, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నడికుడ మండలంలోని రామకృష్ణాపూర్‌ గ్రామానికి చెందిన గాజ కుమారస్వామి(45)కి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె శ్రీవిద్య(19) ఇంటర్‌ చదివింది. గతేడాది ఇంటర్‌లో ఒక సబ్జెక్టు ఫెయిల్‌ కావడంతో తిరిగి పరీక్ష రాసింది. అయినా ఉత్తీర్ణత సాధించకపోవడంతో తండ్రి ఆదివారం ఉదయం శ్రీవిద్యను మందలించాడు. మనస్తాపానికి గురైన ఆమె సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు పరకాల లోని ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుమారస్వామి కూడా కంఠాత్మకూర్‌లోని తన వ్యవసాయ పొలం సమీపం లో సోమవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన సమీప రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతని భార్య రమ దామెర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love