బీఆర్‌ఎస్‌కు డీసీసీబీ చైర్మెన్‌ రాజీనామా

– త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటన
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్‌ తగిలింది. ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మెన్‌ అడ్డి భోజారెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. శనివారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో తన అనుచరులు, అభిమానులతో కలిసి చర్చించిన తర్వాత ఏ పార్టీలో చేరబోయేది నిర్ణయం తీసుకుంటానన్నారు. మూడ్రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణ వెల్లడిస్తానని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరానని, పదేండ్లపాటు పార్టీ కోసం పని చేశానన్నారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నన్ని రోజులు తనకు సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాజీ మంత్రి జోగు రామన్న తనకు అన్నలాగా తోడున్నారని చెప్పారు. అయితే, భోజారెడ్డి బాటలోనే మరికొందరు కీలక నాయకులు త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని ప్రచారం సాగుతోంది.

Spread the love