– ఎంఫిల్ను నిలిపివేయాలి
– పరిశోధనతో నాలుగేండ్ల యూజీ డిగ్రీల ఆనర్స్
– సైన్స్యేతర సబ్జెక్టుల్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్
– యూజీసీ నిపుణుల కమిటీ సిఫారసులు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
కోర్సు కనీస వ్యవధితో సంబంధం లేకుండా, అవసరమైన అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)లతో డిగ్రీలు ప్రదానం చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అవసరమైన ఏబీసీలతో విద్యార్థి సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ వంటి అర్హతల అవార్డు కోసం పరిగణించబడవచ్చని పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థలు ప్రదానం చేసే డిగ్రీలకు కొత్త నామకరణంపై ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీ సిఫార్సులను గురువారం యూజీసీ విడుదల చేసింది. ప్రోగ్రామ్లో పరిశోధనా భాగాలు పొందుపరచబడి ఉంటే, ‘ఆనర్స్ విత్ రీసెర్చ్’ అనే నామకరణంతో యుజి డిగ్రీలను ప్రదానం చేయడం సిఫారసులలో ఉన్నాయి. ఆర్ట్స్, హ్యుమానిటీస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, కామర్స్ మొదలైన సైన్స్-యేతర సబ్జెక్టుల్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లేదా బిఎస్ డిగ్రీలను అందజేయాలి. దీని ప్రకారం, అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) స్థాయిలో స్పెషలైజేషన్ లేదా ప్రధాన సబ్జెక్ట్ విషయంలో విద్యార్థులకు అందించే డిగ్రీ సర్టిఫికేట్లోని ప్రోగ్రామ్ నామకరణాన్ని ”బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ స్పెషలైజేషన్” అని కూడా రాయొచ్చని కమిటీ తెలిపింది. విశ్వవిద్యాలయాలు ఒకటి, రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లకు, కళలు, మేనేజ్మెంట్, కామర్స్, మానవీయ శాస్త్రాలు వంటి విభాగాలకు కూడా ‘మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్)’ నామకరణాన్ని అనుసరించవచ్చని సూచిస్తున్నాయి. దీనితో పాటు ఎంఫిల్ ప్రోగ్రామ్ను రద్దు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. సైన్సెస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, కామర్స్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) స్థాయిలలోని అన్ని విభాగాలకు ఈ నామకరణం వర్తిస్తుంది. మాస్టర్స్ ఏడాదికి అనుమతి ఇవ్వాలని, అంతర్జాతీయ నిబంధనలకనుగుణంగా డిగ్రీలు ఉండాలని సూచించింది. నిపుణుల కమిటీ తన తాజా సిఫారసులకనుగుణంగా నామకరణాన్ని సవరించే కసరత్తును చేపట్టేందుకు, అవసరాల ఆధారంగా సంబంధిత నియంత్రణ అధికారుల నుండి నామినీలతో ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. ఈ సిఫారసులపై విశ్వవిద్యాలయాలు సలహాలను పంపవచ్చని కమిటీ తెలిపింది.