నవతెలంగాణ-నెల్లికుదురు
పేదల సొంతింటి కళ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్ అన్నారు. ఆదివారం ఆ పార్టీ మండలాధ్యక్షుడు ఏదేళ్ల యాదవరెడ్డి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ తో కలిసి నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ లబ్దిదారుడు మద్దెల లక్ష్మీ-సారయ్య మాట్లాడుతూ..గత పదిహేనేండ్లుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు గురించి ఆలోచించిన పాపాన పోలేదని, సొంతిల్లు మాకు జీవితకళ అని, ఆ కళను ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వమే సాకారం చేసిందని చెప్పారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే మురళీ నాయక్ కు, కాంగ్రెస్ జిల్లా, మండలాధ్యక్షులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉమా మురళీ నాయక్ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ పథకాలు గడపగడపకూ చేరేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పేదల కళ్ళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరయ్యాయనీ, అయినా పేదల కోసం అదనంగా మరో వెయ్యి ఇండ్లను మంజూరు చేయించామని గుర్తు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి, ఉసూరుమనిపించారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాధవి ప్రశాంత్ ఉప సర్పంచ్ సుమన్ నాయకులు బెల్లి నరసయ్య గుగులోతు బాలాజీ నాయక్ గుగులోతు శ్రీనివాస్ వివిధ గ్రామాల సర్పంచులు జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.



