రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయాలని డీజీపీ నిర్ణయం

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాజాగా.. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు విచారణను ముగిస్తున్నట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు. 2016లో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడగా.. ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. దీంతో ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తేల్చారు. అంతేకాదు.. రోహిత్ వేముల ఎస్సీ సామాజికవర్గానికి చెందిన యువకుడు కాదని కోర్టుకు సమర్పించిన రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అయితే, రోహిత్ వేముల ఆత్మహత్య కేసును క్లోజ్ చేయడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో కేసును మరోసారి దర్యాప్తు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. కేసును రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా నిర్ణయించారు. ఈ క్రమంలోనే పునర్విచారణకు అనుమతి కోరుతూ కోర్టులో తెలంగాణ పోలీస్ శాఖ పిటిషన్ దాఖలు చేయనున్నది.

Spread the love