నవతెలంగాణ – అమరావతి: విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. డయేరియా బారిన పడి ఇప్పటి వరకు 9 మంది చనిపోగా.. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని.. దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ అధినేత ప్రభుత్వాన్ని కోరారు.