– కాంగ్రెస్కు బేషరతుగా మద్దతు
– ప్రభుత్వ ఓట్లు చీలొద్దనే..ఈ నిర్ణయం
– పాలేరులో పోటీ చేయను : వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైఎస్ఆర్టీపీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోదనీ, కాంగ్రెస్కు బేషరతుగా మద్దతు ప్రకటించనున్నట్టు వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదనీ, కేసీఆర్ అవినీతి పాలన అంతం కావాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలని చెప్పారు. ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. కేసీఆర్కు తిరిగి అవకాశం ఇవ్వొద్దని పలువురు కాంగ్రెస్ నేతలు కోరారని తెలిపారు. వైఎస్ఆర్ నిర్మించిన పార్టీని ఓడించటం భావ్యం కాదని భావించినట్టు తెలిపారు. దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. పాలేరు నుంచి పోటీలో ఉండబోమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే..అవినీతి పెచ్చరిల్లుతుందనీ, పేపర్లీకేజీలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.