నవతెలంగాణ – అశ్వారావుపేట
మెడికల్ సేల్స్ ఆన్లైన్ విధానాన్ని నిరసిస్తూ అఖిలభారత ఔషధ వ్యాపారుల సంఘం పిలుపుమేరకు అశ్వారావుపేట కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నియోజక వర్గం వ్యాప్తంగా బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా మెడికల్ షాపులు పూర్తిగా మూతపడ్డాయి. స్థానిక కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులు ఈ బంద్ లో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కొణిజర్ల ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ ఆన్లైన్ ద్వారా భారీ డిస్కౌంట్లతో మందులు విక్రయించడం వల్ల సాంప్రదాయ, చిన్న మెడికల్ షాపుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ టైంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారని దానిలో భాగంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వం జీవో 220(ఈ)ని రద్దు చేయాలని, అలాగే జీవో 817(ఈ)ని సవరించాలని వారు డిమాండ్ చేశారు.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో యాంటీబయాటిక్స్, ఇతర తీవ్రమైన మందులు విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని అసోసియేషన్ నేతలు హెచ్చరించారు. బంద్ కారణంగా అశ్వారావుపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అశ్వారావుపేట,దమ్మపేట,ములకలపల్లి,చండ్రుగొండ,అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రాల్లోని ఔషధ కార్పొరేట్ మెడికల్ షాపులను బందు చేశారు , మానవతా దృక్పథంతో కేవలం అత్యవసర మందుల సరఫరా కోసం ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న కొన్ని ప్రత్యేక దుకాణాలను మాత్రమే అనుమతించినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పవన్, ఆదిత్య, బాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు.



