ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఈడీ నోటీసులు

నవతెలంగాణ-హైదరాబాద్ : మనీలాండరింగ్‌ కేసులో ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 29న విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఢిల్లీ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఉన్న కాలంలో జరిగిన నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే కేసులో గత వారం ఈడీ అధికారులు ఆయనను 13 గంటలపాటు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆయనకు శనివారం బెయిల్‌ మంజూరుచేసింది. రూ.15 వేల పూచీకత్తుతో బెయిల్‌ ఇఇస్తున్నట్లు తెలిపింది. కాగా, ఆయన జైలు విడుదల కాగానే మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీచేయడం గమనార్హం. ఇప్పటికే ఆయనపై ఏసీబీ, సీబీఐ రెండు ఎఫ్‌ఐఆర్‌లను దాఖలు చేశాయి. చట్టవ్యతిరేకంగా ఇప్పటివరకు 32 మందిని నియమించారంటూ ఎఫ్‌ఐఆర్‌లో నమోదయింది. గతంలో కూడా అక్రమ నియామకాలకు పాల్పడ్డారని అనుమానిస్తూ అమానతుల్లాను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Spread the love