
నవతెలంగాణ – భువనగిరి రూరల్
రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం నాడు ఆమె డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా, రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటు, వాటి పనితీరు, అలాగే ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాలక్ష్మి, గృహాజ్యోతి పథకాల ద్వారా అర్హత కలిగిన వారందరు ప్రయోజనం పొందేలా అన్ని ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపల్ వార్డు ఆఫీసులలో సత్వరమే ప్రజాపాలన సేవా కేంద్రాలను వెంటనే నెలకొల్పాలని ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా దరఖాస్తులు చేసుకోలేకపోయిన అర్హులైన వారితో పాటు, దరఖాస్తులలో సరైన వివరాలు నమోదు చేయని వారి కోసం ప్రజాపాలన సేవా కేంద్రాలు పని చేయాలని సూచించారు. కేంద్రాలలో ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన కంప్యూటర్ ఏర్పాటు చేస్తూ, డేటా ఎంట్రీ ఆపరేటర్ ను నియమించాలని, కార్యాలయాల పని దినాలలో ప్రతి రోజు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ప్రజా పాలన సేవ కేంద్రాలు తెరిచి ఉంచాలన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోలేకపోయిన వారి కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకునేందుకు వీలుగా అభయహస్తం దరఖాస్తు ఫారాలను ప్రజాపాలన సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని, అదే విధంగా సరైన రీతిలో వివరాలను పొందుపర్చలేకపోయిన దరఖాస్తుదారుల వివరాలను సరిచేస్తూ ఆన్లైన్లో అప్ డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వంట గ్యాస్ ఏజెన్సీ పేరు, వినియోగదారుడి నెంబరు, రేషన్ కార్డు వివరాలు, మొబైల్ నెంబరు తదితర వాటిని సరిచేస్తూ ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్ తో పాటు, త్వరలో ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఏ చిన్న తప్పిదాలు, అవాంఛనీయ ఘటనలకు సైతం తావులేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాలలోకి సెల్ ఫోన్లను అనుమతించకూడదని, కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా గట్టి చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యానికి తావిస్తూ, అక్రమాలకు ఆస్కారం కల్పించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ తీరును అనునిత్యం సమీక్షిస్తూ, పరీక్షలు ముగిసేంత వరకు ఎంతో జాగరూకతతో వ్యవహరించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, కాపీయింగ్ జరిగేందుకు అవకాశం ఉన్న సెంటర్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించాలని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే, డిప్యూటీ పోలీస్ కమీషనర్ రాజేష్ చంద్ర, జిల్లా విద్యా శాఖ అధికారి కే. నారాయణ్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సి రమణి, అధికారులు పాల్గొన్నారు.