– సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం విజయవంతం చేయాలి
– గుర్రాల బాలకృష్ణ
నవతెలంగాణ ఆలేరు రూరల్ : సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న నిర్వహించనున్న పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గుర్రాల బాలకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన నవతెలంగాణ విలేకరితో మాట్లాడుతూ ఉద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఉద్యోగి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ రెండున్నరేళ్లు దాటినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం రాష్ట్ర జేఏసీ ఇచ్చే పిలుపులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని బాలకృష్ణ కోరారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిరంకుశ వైఖరిని విడనాడి, ఉద్యోగులను ప్రభుత్వంలో, ప్రజల్లో అంతర్భాగంగా గుర్తించాలని అన్నారు. ఓపీఎస్ అమలుతో ఉద్యోగుల ఆర్థిక భద్రత బలోపేతమై, పదవీ విరమణ అనంతరం కుటుంబ అవసరాలను తీర్చుకుంటూ సమాజంలో గౌరవంగా జీవించే అవకాశం కలుగుతుందని తెలిపారు.
సెప్టెంబర్ 1న నిర్వహించే పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమంలో ఉద్యోగులంతా ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



