– ఇందిరాపార్క్ ధర్నాకు ఆలేరు నుంచి తరలివెళ్లిన సీపీఐ(ఎం) నాయకత్వం
నవతెలంగాణ – ఆలేరు రూరల్ : జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇందిరాపార్క్లో నిర్వహించిన ధర్నాకు ఆలేరు నుంచి సీపీఐ (ఎం) నాయకత్వంలో పెద్ద సంఖ్యలో నాయకులు తరలివెళ్లారు.ఈ సందర్భంగా రైతు సంఘం మండల కార్యదర్శి సూదగాని సత్యరాజయ్య మాట్లాడుతూ జిల్లాలో అనేక నీటి వనరులు, సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ వాటికి అవసరమైన నిధులు కేటాయించి పూర్తి చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.
ఆలేరు ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ఎంతో కీలకమైన గంధమల్ల రిజర్వాయర్ను పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రాజెక్టు పనుల్లో చెప్పుకోదగ్గ పురోగతి లేదని అన్నారు. కనీసం ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల పాలన కాలంలోనే గంధమల్ల రిజర్వాయర్ను పూర్తి చేసి ఆలేరు ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
అలాగే దేవాదుల ప్రాజెక్టులో భాగంగా టంగుటూరు,పటేల్గూడెం,కందిగడ్డ తండా, శారాజీపేట,తూర్పుగూడెం,గోలనుకొండ తదితర గ్రామాల వరకు కాలువలు తీసి మధ్యలోనే పనులు నిలిపివేయడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథాగా మారుతోందని తెలిపారు.వెంటనే అశ్వరావుపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలని కోరారు.
పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం ఈ నెల 29, 30 తేదీల్లో భువనగిరి జిల్లా కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు పాదయాత్ర నిర్వహించామని, దానికి కొనసాగింపుగా సోమవారం ఇందిరాపార్క్లో ధర్నా చేపట్టినట్లు సత్యరాజయ్య తెలిపారు. సాగునీటి సమస్యల పరిష్కారం కోసం రైతాంగం పెద్ద ఎత్తున కదిలి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కారే రాజు, అంగడి నరేష్,అంగడి శ్రీనివాస్, చౌడబోయిన యాదగిరి,చౌడబోయిన సుధాకర్, దండు ఐలయ్య,సత్తయ్య,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



