అగ్రికల్చర్ ఫార్మసీలో 86.27 శాతం అర్హతవారం రోజుల్లో కౌన్సెలింగ్ షెడ్యూల్
ఇంజినీరింగ్ మొదటి ర్యాంకర్ అమ్మాయి
అగ్రికల్చర్, ఫార్మసీలో టాపర్ అబ్బాయి
-ఎప్ సెట్-2026 ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కేశవ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలతోపాటు అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎప్ సెట్-2026 ఫలితాలను హైదరాబాద్ లోని జేఎన్టీయూ క్యాంపస్లో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు విడుదల చేశారు. ఇంజినీరింగ్ లో 73.36 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీలో 86.27 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఎప్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను వారం రోజుల్లో ప్రకటించనున్నట్టు తెలిపారు. ఎప్ సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి ఎం యోగిత రాణా, కళాశాల విద్య కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్, ఎప్సెట్-2026 కన్వీనర్ ప్రొఫెసర్ విజయకుమార్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి సెక్రెటరీ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, ఎప్ సెట్ కో కన్వీనర్ ప్రొఫెసర్ బాలు నాయక్ పాల్గొన్నారు.
ఎప్ సెట్-2026 పరీక్షల్లో భాగంగా ఈ నెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను, ఈ నెల 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలను నిర్వహించిన కేవలం ఐదు రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,10,766 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 1,97,242 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 1,44,704 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్లో 90,977 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 84,954 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అందులో 73,294 మంది అర్హత సాధించారు. అర్హత సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించనున్నట్టు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్-10 మంది ర్యాంకర్ల వివరాలను యోగితా రాణా విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాప్-10 ర్యాంకర్ల వివరాలను శ్రీదేవసేన విడుదల చేశారు. ఇంజనీరింగ్లో బాలిక ఎం రుషి 156.63 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో ఎం.అహ్మద్ 150.17 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించాడు.
ఇంజనీరింగ్ విభాగంలో టాప్-5 ర్యాంకర్లు
ఎం.రుషి.. 156.63 మార్కులు, (ఉప్పల్, మేడ్చల్) ఫస్ట్ ర్యాంక్,
బి.అన్షుల్ 148.70 మార్కులు (మూసాపేట్, మేడ్చల్ మల్కాజిగిరి) రెండో ర్యాంక్,
ఎం.వంశీధర్ రెడ్డి 147.05 మార్కులు (పులివెందుల,కడప) మూడో ర్యాంక్,
జొన్నలగడ్డ రోషన్ మణిదీప్రెడ్డి 144.44 మార్కులు (గుంటూరు) నాలుగో ర్యాంక్,
ఆదుల సాయి నిఖిత్ 143.30 మార్కులు (మహబూబ్నగర్) ఐదో ర్యాంక్ సాధించారు.
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో..
ఎం.అహ్మద్ 150.17 మార్కులు (హుమాయున్ నగర్, హైదరాబాద్) మొదటి ర్యాంక్,
టి.నివృత్ సాయి వెంకట్ 143.43 మార్కులు (ఎర్రమంజిల్, హైదరాబాద్) రెండో ర్యాంక్,
జి.సాహితి గీతిక142.35 మార్కులు (అల్మాస్ గూడ, రంగారెడ్డి) మూడో ర్యాంక్,
ఎం.జయసింహ 139.78 మార్కులు (బాగ్ అంబర్ పేట్, హైదరాబాద్) నాలుగో ర్యాంక్,
ఆమేర్ అనస్ 137.40 మార్కులు (హుమాయున్ నగర్, హైదరాబాద్) ఐదో ర్యాంక్ సాధించారు.



