– సామూహిక నిరసన తెలిపిన ఆపరేటర్లు
– అధికారులకు వినతి పత్రాలు అందజేత
నవతెలంగాణ-మణుగూరు
ప్రశాంతతకు మారుపేరైన మణుగూరులో ప్రయివేటు వాహన డ్రైవర్ల నియామక ఏరియా యాజమాన్యం ప్రతిపాదన ఓసీ గనులలో ఒక్కసారిగా మంటలు లేపాయి. ఆపరేటర్లు యాజమాన్యం ప్రతిపాదనకు వ్యతిరేకంగా గళం విప్పారు. రాజకీయాలకతీతంగా అందరూ ఒక తాటిపై నిలిచారు. వివరాల్లోకి వెళితే…పీకే ఓసీలో ప్రైవేటు వెహికల్ డ్రైవర్ల నియామక ప్రతిపాదన విరమించుకోవాలని సోమవారం ఉదయం పీకే ఓసి సెక్షన్-2 లో ఆపరేటర్లు సామూహిక నిరసన తెలిపారు. అనంతరం పీకే ఓసి అధికారులు ప్రాజెక్ట్ మేనేజర్ దండమూడి రాంబాబు, గని మేనేజర్ కె.సురేష్ కుమార్, సీనియర్ పిఓ ఎండి మదార్ సాహెబ్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పీకే ఓసీలో ఆపరేటర్లతో పాటు ఓసి గనుల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషించే భారీ యంత్రాలు నడిపేందుకు పొరుగు సేవలు అనగా ప్రైవేటు (ఈపి ఆపరేటర్లకు పోటీగా) కాంట్రాక్ట్ వాహన డ్రైవర్లు వస్తున్నారని దీనికై ప్రతిపాదనలు దాదాపు సిద్ధమయ్యాయని, సింగరేణి సిఎండి ఎన్ బలరాం సంతకం పెట్టిన మరుక్షణం పీకే ఓసీలో అమలుకు సిద్ధమని గత యాజమాన్య ప్రైవేటీకరణ విజయాల అనుభవంతో మణుగూరు పీకే ఓసిలోనే ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని, దీని కార్యాచరణకు శ్రీకారం కూడా చుట్టారనీ ప్రచారంతోపాటు వివిధ పత్రికల్లో కూడా వార్తలు వస్తున్నాయన్నారు. ఏరియా జిఎం దుర్గం రామచందర్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారన్నారు. సింగరేణి తల్లిని కాపాడుకోవడం కోసం కార్మిక సంఘాలతో కలిసి ఆందోళనలు కూడా తప్పవని కూడా వారు యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు మేకల ఈశ్వర్, వత్సవాయి కృష్ణంరాజు, ఎస్ గట్టయ్య, కోడి రెక్కల శ్రీనివాస్, మహి వికేందర్, గూగులోత్ దశరథ్, జానకి ప్రసాద్, ఎస్.కుమారస్వామి, బర్ల గోపి, జాన్ అబ్రహం, ఈ.యాకయ్య, ఎం.చేరాలు, దరిశా రమేష్, రవి, హనుమాన్ బాబు, నయిమత్ హుస్సేన్, మాదాసి శ్రీనివాస్, సర్వేష్, యు.శ్రీనివాస్, ఎల్.సతీష్, సిహెచ్ సతీష్, గిరీష్ రెడ్డి, లెనిన్, ఐ.సత్యనారాయణ, ఆపరేటర్లు పాల్గొన్నారు.