ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బుద్ధ జయంతిని సంపూర్ణ నేషనల్ హాలిడేగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నాలో ‘కింగ్ బుద్ధ’ మూవీ డైరెక్టర్ సత్యారెడ్డి తీవ్రంగా స్పందించారు.
అలాగే గౌతమ బుద్ధుడిని పిరికివాడిగా వ్యాఖ్యానించిన ప్రవచనకర్త గరికపాటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఇక నుంచి ఎవరైన గౌతమ బుద్ధుని గురించి తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు. బుద్ధుని అవమానించే ప్రయత్నాలు ఏవైనా జరిగితే వాటిని తీవ్రంగా ఖండిస్తాం’ అని సత్యారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’గౌతమ బుద్ధుడు సాధారణ వ్యక్తి కాదు, ఆయన ‘శాక్య సింహం’. ఆయన జీవితం పిట్ట కథలు, చేపల కథలు కాదు, అది ఒక మహా వీరగాథ, శాంతి సందేశం. భావితరాలకు బుద్ధుని నిజమైన చరిత్ర, తత్వం. ఆయన చూపిన మార్గం తెలియజేయడం మన బాధ్యత. బుద్ధుడిగా మారిన తర్వాత కపిలవస్తు రాజ్యంలో అడుగు పెట్టిన రోజు ఆయన భార్య యశోదర పట్టణాన్ని దీపాలతో అలంకరించి, అపూర్వ స్వాగతం పలికింది. ఆ మహత్తర సందర్భమే తర్వాత ‘బుద్ధ దీపావళి’గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని మార్గాన్ని అనుసరిస్తున్న దాదాపు 25 దేశాలు శాంతి, అభివద్ధి, సమానత్వంలో ముందంజలో ఉన్నాయి. ఆ దేశాల పురోగతిని చూసి భారతదేశం కూడా మరోసారి బుద్ధిజం వైపు పయనించాలి. అదే నిజమైన శాంతి, అభివద్ధి దారి’ అని తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మద్దతుదారులు కూడా బుద్ధ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
‘బుద్ధ జయంతి.. జాతీయ గౌరవ దినం కావాలి’ అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని దేశమంతా విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇస్తామని సత్యారెడ్డి చెప్పారు.
తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు
- Advertisement -
- Advertisement -



