రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం

– ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ – వీణవంక
రైతులకు అండగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని రెడ్డిపల్లి, కోర్కల్, వల్బాపూర్, చల్లూరు, వీణవంక క్లస్టర్ రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమాన్ని చేపట్టి రాష్ట్రాన్ని సాధించి తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకెళ్తోందని అన్నారు. ప్రతి రైతుకు లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన తొలినాళ్లలోనే కాలేశ్వరం ప్రాజెక్టు చేపట్టి రైతులందరికీ సాగునీరు అందించడం పాటు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే పెట్టుబడి సాయంగా ఎకరాకు పదివేలు అదేవిధంగా రైతు బీమా రైతు చనిపోయిన కుటుంబంలో ఎవరు ఆగం కావద్దనే ఉద్దేశంతో రైతు బీమా పథకం లో భాగంగా చనిపోయిన వారం రోజుల్లోనే రూ.ఐదు లక్షలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కావున రానున్న రోజుల్లో రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, సీఎం కేసీఆర్ను మళ్లీ సీఎంగా ఎన్నుకోవాలని, ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. అలాగే రెడ్డిపల్లి క్లస్టర్ లో కోర్కల్ రైతు వేదికలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి, వల్బాపూర్ రైతు వేదికలో సర్పంచులపోరమ్ మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, చల్లూరు రైతు వేదికలో జెడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. తహసిల్దార్ దండిగ రాజయ్య, ఎంపీఓ ప్రభాకర్, సర్పంచులు ఎంపీటీసీలు, పిఎసిఎస్ డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి కన్వీనర్లు, సభ్యులు అధికారులు పాల్గొన్నారు.

 

Spread the love