నవతెలంగాణ – జమ్మూకశ్మీర్
జమ్మూకశ్మీర్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో ఏడుగురు తీవ్రం గాయపడ్డారు. దోడా జిల్లాలోని భదర్వా–పఠాన్కోట్ రహదారిపై గుల్దండ సమీపంలో అదుపు తప్పి ఈ ఘటన చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకునే సమయానికే ఐదుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. గాయపడ్డ ఏడుగురు చికిత్స పొందుతున్నారని దోడా ఎస్ఎస్పీ అబ్దుల్ ఖయూమ్ పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహనం కథువా జిల్లాలోని బనీ ప్రాంతం నుంచి భదర్వాకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.