ఘోర రోడ్డు ప్రమాదం..27మంది మృతి

నవతెలంగాణ – మెక్సికో
మెక్సికోలోని ఓక్సాకాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. 17 మంది గాయపడ్డారని.. వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఓక్సాకా స్టేట్ ప్రాసిక్యూటర్ బెర్నార్డో రోడ్రిగ్జ్ అలమిల్లా పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభిస్తున్నామన్నారు.  సివిల్‌ ప్రోటెక్షన్‌ ఏజెన్సీ ప్రకారం.. గాయపడ్డ ఆరుగురు అపస్మారక స్థితిలో ఉన్నారని, వారిని ఆసుపత్రికి తరలించిన సమయంలో విషమంగా ఉందని పేర్కొంది. స్థానిక రవాణా సంస్థ నిర్వహిస్తున్న బస్సు మంగళవారం రాత్రి మెక్సికో సిటీ నుంచి శాంటియాగో డి యోసోండువా పట్టణానికి వెళ్తున్నది. ప్రమాదవశాత్తు నియంత్రణ కోల్పోయి బస్సు మాగ్డలీనా పెనాస్కో పట్టణంలో వద్ద 80 అడుగుల లోతులో పడిపోయి ఉంటుందని రాష్ట్ర అధికారి జీసస్ రొమెరో పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన బస్సును నడుపుతున్న కంపెనీ మెక్సికో సిటీ నుంచి రోజువారీ సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించామని, మృతదేహాలను ఎమర్జెన్సీ సర్వీసెస్‌ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు. ఘటనపై ఓక్సాకా గవర్నర్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అయితే, మెక్సికోలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమే. మేలో పశ్చిమ రాష్ట్రమైన నయారిట్‌లో బస్సు లోయలో పడడం కనీసం 18 మంది మెక్సికన్ పర్యాటకులు మరణించారు. అదే నెలలో ఈశాన్య రాష్ట్రమైన తమౌలిపాస్‌లోని హైవేపై ప్యాసింజర్ వ్యాన్, సెమీ ట్రక్కు ఢీకొనడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

Spread the love