మసీదు వద్ద డ్యాన్స్‌ చేస్తు లోపలకి ప్రవేశించేందుకు యత్నం..ఐదుగురు అరెస్ట్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : ఒక గుంపు మసీదు వద్ద డ్యాన్స్‌ చేసింది. ఆ తర్వాత అందులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ నేపథ్యంలో మెన్‌దావాల్‌లో శ్రీరామ శోభా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు స్థానిక మసీదు వద్ద డ్యాన్సులు చేశారు. మతపరమైన నినాదాలు చేయడంతోపాటు ఆ మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. మతసామరస్యం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు స్పందించారు. ఈ వీడియో క్లిప్‌ను పరిశీలించారు. నిందితులైన గణేష్ ప్రజాపతి, సిద్ధాంత్ జైస్వాల్, అశోక్ కుమార్, అనిల్, రమేష్‌ను అరెస్ట్‌ చేశారు. అలాగే అదే రోజున ఖలీలాబాద్‌లో జరిగిన మరో సంఘటనలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Spread the love