పెళ్లి ఊరేగింపుపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురి మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని రాయిసేన్‌ జిల్లాలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ ట్రక్కు అదుపుతప్పి ఆ బరాత్పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. 11 మందికిపైగా గాయపడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, జాతీయ రహదారి భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పెళ్లి బృందం హోసంగాబాద్‌ నుంచి పిపరియా గ్రామానికి స్థానిక జాతీయ రహదారిపై ఊరేగింపుగా వెళ్తుండగా అటువైపుగా దూసుకొచ్చిన ట్రక్కు వారిని బలంగా ఢీ కొట్టినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వెల్లడించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్గ్రేసియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Spread the love