గొంతు సమస్యలకు…

గొంతు సమస్యలకు...సాధారణంగా సీజన్‌ మారినప్పుడల్లా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అందులోనూ ప్రస్తుత చలికాలంలోసీ సమస్య మరీ తీవ్రంగా ఉంటోంది. కనీసం ఇంటికి ఒకరైనా ఈ సమస్యతో బాధ పడుతున్న వారు ఉన్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే.. కాస్త ఉపశమనం లభిస్తుంది. అవేంటంటే…
గొంతు నొప్పితో బాధపడేవారు ఒక చెంచా ఉప్పు లేదా వంట సోడాను గ్లాస్‌ గోరువెచ్చని నీటిలో వేసి కలియబెట్టాలి. ఆ నీటిని పుక్కిలించాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే ఉప్పు యాంటిసెప్టిక్‌గా పనిచేసి గొంతును శుభ్రం చేసి నొప్పినుంచి ఉపశమనం కలిగిస్తుంది. బీపి ఉన్నవాళ్లు మాత్రం ఈ పని చేయరాదు.
వేడి నీటిలో కాస్త తేనె వేసి తీసుకుంటే గొంతునొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి రోజూ తీసుకుంటే గొంతు సమస్యలు తొలగిపోతాయి.
దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తింటే దగ్గు, జలుబుతో కూడిన గొంతు నొప్పి నుంచి రిలీఫ్‌ లభిస్తుంది.
మిరియాల పొడిని కాస్త తేనెలో కలిపి తినటం లేదా పాలల్లో మిరియాలపొడి కలిపి తాగినా గొంతు సమస్యలు తగ్గుతాయి.
గొంతులో మంటగా ఉంటే వెల్లుల్లి పాయను తింటే గొంతులో మంట తగ్గుతుంది.
గొంతులో గరగర వంటి సమస్యలు పోవాలంటే ఉల్లిగడ్డ రసం సేవించడం లేదా అల్లంతో చేసిన టీ గానీ, అల్లాన్ని నీటిలో ఉడికించి ఆ నీటిని గాని సేవిస్తే గొంతు సమస్యల నుండి బయటపడొచ్చు.

Spread the love