ఫౌండర్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఏర్పాటైన ఫౌండర్స్‌ ల్యాబ్‌ సంస్థను హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ కార్యాలయంలో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న విద్యాసంస్థలు యూనివర్సిటీలు, ఇంజనీరింగ్‌ కాలేజీలలో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగించనున్నది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ స్టార్టప్‌ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని రాష్ట్రంలో యువతను ఈ దిశగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇప్పటికే టి-హబ్‌, టి- వర్క్స్‌, అగ్రి హబ్‌, వి- హబ్‌ వంటి అనేక వేదికలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఫౌండర్స్‌ ల్యాబ్‌ సంస్థ కాలేజీ స్థాయి నుండే విద్యార్థులను పారిశ్రామిక వెత్తలుగా తీర్చిదిద్దే విధంగా వారికి శిక్షణ అందించడం ఒక మంచి పరిణామం అన్నారు. ఫౌండర్స్‌ ల్యాబ్‌ సంస్థ వ్యవస్థాపకులు సిఇఒ శకుంతల కాసరగడ్డ మాట్లాడుతూ ఫార్మా, అగ్రికల్చర్‌, మేనేజ్మెంట్‌ రంగాలను ఇంజనీరింగ్‌ రంగాలతో అనుసంధానం చేస్తూ సమాజానికి అవసరమైన అనేక ఆవిష్కరణలు విద్యార్థుల ద్వారా వెలికితీసే అవకాశం ఉందన్నారు.
ఈ క్రమంలో విద్యాసంస్థల మరియు ప్రభుత్వ సహకారంతో వారికి కావాల్సిన అన్ని అంశాల్లో సంస్థ పూర్తి సహకారం అందజేసి వారిని అత్యుత్తమ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని విధాలా సేవలను అతమ సంస్థ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ శాఖా ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, ఎమ్మేల్యేలు నన్నపనేని నరేందర్‌, పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, ఆ సంస్థ డైరక్టర్‌ సత్య ప్రసాద్‌ పెద్దపెల్లి పాల్గొన్నారు.

Spread the love