నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశాలు…

నవతెలంగాణ – శ్రీనగర్
జమ్మూలోని శ్రీనగర్‌లో నేడు ప్రారంభం కానున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. సమావేశం జరగనున్న షేర్-ఏ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే మార్గాలతో పాటూ నగరం మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించిన తరువాత అక్కడ జరుగుతున్న తొలి అంతర్జాతీయ సమావేశం ఇదే కావడంతో పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాల్లో జీ20 సభ్య దేశాలకు చెందిన సుమారు 60 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సింగపూర్‌ నుంచి అత్యధికంగా హాజరవుతారని అధికారులు తెలిపారు. జుమ్మూలో ఈ సమావేశాలను నిర్వహించడంపై చైనా ఇప్పటికే అభ్యంతరం చెప్పగా, సౌదీ అరేబియా ఇప్పటివరకూ సమావేశంలో పాల్గొనడంపై ఎటూ తేల్చలేదు. ఈ సమావేశానికి దూరంగానే ఉండాలని టర్కీ నిర్ణయించింది. ఇక, అంతర్జాతీయ సమావేశాలను వివాదాస్పద ప్రాంతాల్లో నిర్వహించకూడదన్న చైనా వ్యాఖ్యలపై భారత్ దీటుగా సమాధానం ఇచ్చింది. తమ భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు తమకుందని తేల్చి చెప్పింది.

Spread the love