కులగణనతోనే అంతరాలు పోతాయి

బీసీ సబ్‌ప్లాన్‌ కావాలంటే కులగణన జరగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం సచివాలయంలో– ఆ తర్వాతే బీసీ సబ్‌ప్లాన్‌ అమలు : ఉప ముఖ్యమంత్రి భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీసీ సబ్‌ప్లాన్‌ కావాలంటే కులగణన జరగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన కులగణన సమావేశంలో ఆయన బీసీ మేధావులు, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ సంపద కొద్ది మంది చేతుల్లో ఉందన్నారు. ఎక్కువమంది ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారని చెప్పారు. ఈ అంతరాలు తొలగిపోవాలంటే కులగణన జరగాల్సిందేనని అన్నారు. ఇందుకు సంబంధించి వివిధ రాష్ట్రాలతోపాటు బీహార్‌లో ఎలాంటి న్యాయపర చిక్కుల్లేకుండా, విజయవంతంగా సర్వే జరిగి చట్టరూపం దాల్చిన తీరును అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. కులగణనకు సంబంధించి రాష్ట్ర క్యాబినెట్‌ కట్టుబడి ఉందన్నారు. ఇది కేవలం రాజకీయ నియామకాల కోసమే కాకుండా జనాభాకు అనుగుణంగా దేశ సంపదను పంచాలని చెప్పారు. సంపద ఎక్కడ ఉంది, భూమిలేని నిరుపేదలు ఎందరు, విద్యలో వెనుకబాటు, ఇల్లు లేని వారు, ద్విచక్ర వాహనాలు లేని వారు ఇలా అన్ని అంశాలను కులగణన సర్వే ద్వారా వెలుగులోకి వస్తాయన్నారు. బీహార్‌లో చేసిన సర్వేలో ఈ అంశాలన్నీ గుర్తించారా? అని అధికారులను అడిగి ఆరా తీశారు. బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ప్రయోజనం చేకూర్చాలంటే కులగణన జరిగి తీరాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కుల గణన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం విప్లవాత్మకమైన చర్యగా అభివర్ణించారు. ఈ చారిత్రిక అంశాన్ని సెమినార్లు, మీడియా సమావేశాలు, యూనివర్సిటీల్లో సదస్సుల ద్వారా తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీసీ మేధావులను భట్టి కోరారు.అసెంబ్లీలో కులగణన తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ఒక ఘట్టం ముగిసిందని సమావేశంలో పాల్గొన్న బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తాము నిజాయితీగా ఉన్నామనీ, క్యాబినెట్‌లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కులగణన తీర్మానాన్ని ఆమోదించామని వివరించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రజలకు అర్థమైందని రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. ఈ కార్యక్రమంతో మరో 15 ఏండ్ల పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పారు. కులగణన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేయడం ద్వారా కొత్త ప్రభుత్వ రాజకీయ సంకల్పం అర్థమైందని ప్రొఫెసర్‌ మురళీధర్‌ అన్నారు. ఈ అంశాన్ని చివరి వరకు తీసుకెళ్తారనీ, అధికారులకు ప్రభుత్వానికి ఈ అంశంలో చిత్తశుద్ధి ఉందని తమకు నమ్మకం కలిగిందని అభిప్రాయపడ్డారు. ఒక పెద్ద జాతీయ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ కులగణనకు కట్టుబడి ఉండడం విప్లవాత్మకమైన చర్య అని ప్రొఫెసర్‌ సింహాద్రి అన్నారు. ఇది విజయవంతంగా పూర్తయితే మిగిలిన అన్ని అంశాలూ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయని చెప్పారు. కింది కులాల పట్ల ఈ ప్రభుత్వానికి నిజాయితీ నిబద్ధత ఉందని తమకు భరోసా కలిగిందని బీసీ నేత క్రాంతి కుమార్‌ అన్నారు. అంధకారంలో ఉన్న బతుకులకు కొత్త ప్రభుత్వం వెలుగులు చూపిస్తుందన్న నమ్మకం కలిగిందన్నారుమీ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళి, బీసీ సంక్షేమం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Spread the love