– యూనిఫాంలు, వేతనాలు, గుర్తింపు కార్డులు
– కార్మికుల న్యాయమైన హక్కుల కోసం పోరాటం
– వేసవిలో పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ – ఎంపీడీవోకు వినతిపత్రం
నవతెలంగాణ – ఉప్పునుంతల
మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులకు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్, ఎంప్లాయిస్ సీఐటీయూ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో వరుణ్ తేజకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు ఆలూరి రమేష్, కార్యదర్శి కలమండల సుల్తాన్ మాట్లాడుతూ, కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చింతల నాగరాజు మాట్లాడుతూ.. కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఆన్లైన్లో నమోదు కాని కార్మికులను నమోదు చేయాలని కోరారు. అలాగే వేసవికాలంలో పని భారాన్ని తగ్గించడంతో పాటు యూనిఫాంలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, బొల్లు భీమయ్య, వంగూరి వెంకటస్వామి, చిక్కుడు రామచంద్రయ్య, ఆలూరి రాజలింగం, కలమండల దాసు, నవనిత, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.



