‘గల్ఫ్‌ కార్మిక ద్రోహి… గప్పాల అరవింద్‌’

– చార్జిషీట్‌ విడుదల చేసిన కాంగ్రెస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గత లోక్‌సభ ఎన్నికల్లో మాయ మాటలతో గల్ఫ్‌ కార్మికుల ఓట్లు కొల్లగొట్టి నిజామాబాద్‌ ఎంపీగా గెలిచిన అరవింద్‌ వారిని మోసం చేశారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ”గల్ఫ్‌ కార్మిక ద్రోహి… గప్పాల అరవింద్‌” పేరిట టీపీసీసీ ఎన్నారై సెల్‌, గల్ఫ్‌ కాంగ్రెస్‌ నాయకులు సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ లో ఒక చార్జిషీట్‌ను విడుదల చేశారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, టీపీసీసీ ఎన్నారై సెల్‌ నాయకులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్‌ రెడ్డి, కేరళ ప్రవాసి కాంగ్రెస్‌ నేత మునీర్‌తో కలిసి ఎంపీ అరవింద్‌పై చార్జిషీట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. చార్జిషీట్‌లో కాంగ్రెస్‌ నాలుగు ఆరోపణలు చేసింది. వాటికి బదులు చెప్పకపోతే అరవింద్‌కు గల్ఫ్‌ కార్మికుల ఓట్లు అడిగే అర్హతే ఉండబోదని విమర్శించారు.
చార్జ్‌షీట్‌లోని ముఖ్యాంశాలు..
– 2020 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం గల్ఫ్‌ కార్మికుల పొట్టగొడుతూ… కనీస వేతనాలు రూ.30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ సర్క్యులర్లు జారీ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కనీసం ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం చేతకాని అసమర్ధుడు అరవింద్‌.
– ‘ప్రవాసి భారతీయ బీమా యోజన’ లో సహజ మరణాన్ని చేర్చకుండా గల్ఫ్‌ కార్మికుల బతుకులతో బీజేపీ ప్రభుత్వం ఆడుకుంటే… అరవిందుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చించ కుండా తప్పించుకుంటూ తిరిగిన ‘గల్ఫ్‌ ద్రోహి’
– హైదరాబాద్‌లో సౌదీ అరేబియా, కువైట్‌ దేశాల కాన్సులేట్‌ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి లెటర్‌ కూడా రాయటం చేతకాని అజ్ఞాని అరవింద్‌.
– కరోనా కష్టకాలంలో… గల్ఫ్‌ దేశాల నుంచి ఇండియాకు వచ్చిన పేద కార్మికుల రక్తం పిండి రెండింతలు, మూడింతలు విమాన చార్జీలు వసూలు చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. వారిని స్వదేశానికి. ఫ్రీగా రప్పించాల్సిన కేంద్రం.. అధిక చార్జీలు వసూలు చేయడాన్ని ప్రశ్నించలేని అరవింద్‌ ఎంపీ పదవికి అనర్హుడు.

Spread the love