దేశ రక్షణలో విశిష్ట సేవలు..
యువతకు ఉపాధి కల్పనలో ఆదర్శప్రాయ కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు
నవతెలంగాణ – మక్తల్
దేశ రక్షణలో తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిన మాజీ సైనికుడు డాక్టర్ ఎం. ఆంజనేయులు (ఆర్మీ), పదవీ విరమణ అనంతరం సమాజ సేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకుని యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన అందిస్తున్న విశిష్ట సామాజిక సేవలను గుర్తించిన ప్రపంచ చారిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆఫ్ న్యూఢిల్లీ వారు, బెంగళూరులోని గాంధీభవన్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో మక్తల్ మండలం మంతన్గౌడ్ గ్రామానికి చెందిన ఆంజనేయులు ఆర్మీకి గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందజేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో 2019లో స్థాపించిన వారియర్స్ డిఫెన్స్ అకాడమీ ద్వారా ఆంజనేయులు ఆర్మీ ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, పారామిలటరీ, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఎస్సీ జీడీ తదితర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నాణ్యమైన శిక్షణ అందిస్తున్నారు.
ఆయన మార్గదర్శకత్వంలో ఇప్పటివరకు 125 మందికి పైగా యువత ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడటం విశేషం. ఉద్యోగ శిక్షణతో పాటు జిల్లాలోని గ్రామాల్లో పర్యటిస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులకు కెరీర్పై అవగాహన కల్పించడం, రక్షణ శాఖ ఉద్యోగాలపై ప్రేరణాత్మక సదస్సులు నిర్వహించడం, పేద విద్యార్థులు, అనాథలకు ఉచిత శిక్షణ, అధ్యయన సామగ్రి, అవసరమైన వారికి వసతి సదుపాయం కల్పించడం వంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తూ వారి భవిష్యత్తుకు అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట (320ఏ) సహకారంతో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్, ప్రతిరోజూ రాత పరీక్షలు, ఫిజికల్ ట్రైనింగ్ నిర్వహిస్తూ యువతను లక్ష్య సాధన వైపు నడిపిస్తున్నారు.
దేశ సేవతో పాటు సమాజ సేవను సమన్వయం చేస్తూ యువతకు దిశానిర్దేశం చేస్తున్న ఆంజనేయులు ఆర్మీకి గౌరవ డాక్టరేట్ లభించడం నారాయణపేట జిల్లా ప్రజలకు గర్వకారణమని పలువురు ప్రజాప్రతినిధులు ప్రముఖులు, శిష్యులు అభినందనలు తెలిపారు.



