నవతెలంగాణ హైదరాబాద్: నేడు హైదరాబాద్ రిసోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఎదిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ట్యాలెంట్ ఉన్న పిల్లలకు మనదేశంలో కొదవ లేదు. ప్రపంచంతో పోటీపడే సత్తా మనకు ఉందని తెలిపారు. హైదరాబాద్ నానక్రాంగూడలో సెల్లాంటిస్ డిజిటల్ హబ్ను, రైట్ సాఫ్ట్వేర్ ఆఫీస్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆటోమొబైల్ రంగం కూడా ఇప్పుడు కంప్యూటర్ ఓరియెంటెడ్ డిజైన్స్ ద్వారా ముందుకు వెళ్తున్నదని అన్నారు. ప్రభుత్వం మొబిలిటి వ్యాలి ప్రారంభించిందన్నారు. కంపెనీకి ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీలో 3 లక్షల మంది పనిచేసే వాళ్లు, ప్రస్తుతం ఆ సంఖ్య 9 లక్షలకుపైగా పెరిగిందన్నారు. ఇక్కడ ఉన్న గ్రోత్ దేశంలోని ఏ నగరంలో లేదని కేటీఆర్ తెలిపారు. వరంగల్లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేసిందందుకు రైట్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మూడేండ్లలో వెయ్యి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినందుకు అభినందించారు. రైట్ సాఫ్ట్వేర్ సీఈవో కృష్ణను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం టీహబ్లో మోబిస్-బిట్స్ పిలాని హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.