అమిత్‌ షాతో కేటీఆర్‌ భేటీ రద్దు

నవతెలంగాణ – హైదరాబాద్
హోం మంత్రి అమిత్‌షాతో మంత్రి కేటీఆర్ భేటీ రద్దు అయ్యింది. ఇతర కార్యక్రమాల్లో హోం మంత్రి బిజీబిజీగా ఉండటంతో శనివారం రాత్రి 10.15 గంటలకు కేటీఆర్‌తో జరగాల్సిన ఈ సమావేశం రద్దయినట్టు అధికారులు కేటీఆర్‌కు తెలియజేశారు. దీంతో, ఆయన ఆదివారం హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు. హైదరాబాద్ రహదారుల విస్తరణకు కేంద్ర హోం శాఖ పరిధిలోని భూములు కొరేందుకు, విభజన చట్టంలోని పలు అంశాలపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరారు. అయితే, ఇతర సమావేశాల్లో పాల్గొంటున్న హోం మంత్రికి కేటీఆర్‌తో సమావేశమయ్యేందుకు సమయం చిక్కలేదు. మణిపూర్ హింసపై అఖిల పక్ష భేటీ, తెలంగాణ బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశం, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులతో వరుస సమావేశాల కారణంగా మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన అపాయింట్‌మెంట్ సమయం దాటిపోయింది. అప్పటికీ ఇంకా ఇతర మీటింగ్స్ మిగిలి ఉండటంతో అపాయింట్‌మెంట్ రద్దు అయినట్టు కేంద్ర హోం శాఖ అధికారులు మంత్రి కేటీఆర్‌కు సమాచారం అందించారు.

Spread the love