సిసోడియాను తలుచుకుని కంటతడిపెట్టిన కేజ్రీవాల్

నవతెలంగాణ – ఢిల్లీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను తలుచుకుని సీఎం అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగాలకు లోనయ్యారు. ఢిల్లీ శివారు ప్రాంతం బవానాలోని దిరియాపూర్ గ్రామంలో స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, విద్యారంగం అభ్యున్నతి కోసం సిసోడియా పడ్డ శ్రమను, ఆయన ఆలోచనలను గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. ఢిల్లీలో పాఠశాల విద్యార్థులందరూ నాణ్యమైన విద్యను అభ్యసించాలని సిసోడియా పరితపించేవారని, ఢిల్లీ విద్యారంగాన్ని దేశంలోనే ఉన్నతమైనదిగా తీర్చిదిద్దాలని ఆరాటపడ్డారని కేజ్రీవాల్ వివరించారు. కానీ, బీజేపీ అక్రమ కేసులతో సిసోడియాను జైలుపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి పాఠశాలలను నిర్మించి, ఢిల్లీ విద్యావ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపించడం వల్లే సిసోడియాను బీజేపీ జైల్లో వేయించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. విద్యారంగంలో తాము విప్లవాత్మక మార్పులు తీసుకురావడం బీజేపీకి ఇష్టం లేదని అన్నారు. సిసోడియా అరెస్టయినప్పటికీ విద్యారంగంలో సంస్కరణలను తాము కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Spread the love