– మూడురోజులూ రెడ్ అలర్టే
– మంగళవారం 877 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వాన ఇడ్వకుంటా కొడుతూనే ఉంది. వచ్చే మూడు రోజులూ ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు విస్తారంగా మోస్తరు వానలు పడుతాయనీ, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి, అత్యంత భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు రెడ్ అల్టర్ జారీ చేశారు. రెడ్, ఆరెంజ్ అలర్ట్ జాబితాల్లో జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, అత్యవసరం అయితేగానీ బయటకు వెళ్లొద్దని సూచించారు. మంగళవారం రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 877 రెయిన్గేజ్ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్లో అత్యధికంగా 7.45 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
అత్యధిక వర్షపాతం నమోదైన ఐదు ప్రాంతాలు
శాంతినగర్(సూర్యాపేట) 7.45
చిలుకూరు(సూర్యాపేట) 7.33
గోండ్రియాల(సూర్యాపేట) 7.20
తాడికల్(కరీంనగర్) 6.7
పోచంపల్లి(కరీంనగర్) 6.5
26.07.23 – రెడ్ అలర్ట్ జిల్లాలు : కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్(భారీ నుంచి అతి, అత్యంత భారీ వర్షాలు)
ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు : హైదరాబాద్, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్నసిరిసిల్ల, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, మంచిర్యాల, నిజామాబాద్ (మోస్తరు నుంచి భారీ వర్షాలు)
27.07.23 – రెడ్ అలర్ట్ జిల్లాలు : ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రిభువనగిరి(భారీ నుంచి అతి, అత్యంత భారీ వర్షాలు)
ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు : హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి (మోస్తరు నుంచి భారీ వర్షాలు)