అత్తాకోడళ్ళకు పడకపోతే?

పెళ్లి చేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టి అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన కోడలు.. అసలు అత్తతో నేను కలిసి ఉండలేనంటే పరిస్థితి ఎలా మారుతుంది?, పెళ్లి చేసుకునే యువకుడు ఏం చేయాలి? చివరకు అతని జీవితంలో జరిగిన మార్పులేంటి? ఓ వైపు తల్లి, మరో వైపు ప్రేయసి మధ్య అతను ఎలా నలిగిపోయాడనే విషయాలు తెలియాలంటే ‘ఎల్‌జీఎం’ (లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌) సినిమా చూడాల్సిం దేనని అంటున్నారు మేకర్స్‌.
ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలో సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.
హరీష్‌ కళ్యాణ్‌, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమేష్‌ తమిళ్‌ మణి దర్శకత్వంలో సాక్షి ధోని, వికాస్‌ హస్జా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ చెన్నైలో జరిగింది.
మూవీ ట్రైలర్‌ను ధోని, ఆయన సతీమణి సాక్షి ధోని రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా మహేంద్ర సింగ్‌ ధోని మాట్లాడుతూ, ‘నేను సినిమా చూశాను. చాలా క్లీన్‌ మూవీ. చక్కటి ఎంటర్‌టైనర్‌. నేను నా కుమార్తెతో కలిసి ఎల్‌జీఎం సినిమా చూస్తాను. తను నన్ను చాలా ప్రశ్నలు వేస్తుంది. అయినా కూడా నేను తనతోనే సినిమా చూస్తాను. నటీనటులు, టెక్నీషియన్స్‌ అద్భుతంగా వర్క్‌ చేశారు. ఈ సినిమాను నేను నిర్మించినందుకు గర్వంగా ఉంది. డైరెక్టర్‌ రమేష్‌ తమిళ్‌ మణి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలోనే సినిమాను రిలీజ్‌ చేస్తాం’ అని తెలిపారు. ‘మన చుట్టూ చాలా మంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. ఈ సినిమాని పర్టికులర్‌గా తమిళంలోనే చేయటానికి కారణం ధోనీనే. చెన్నైతో మాకున్న అనుబంధం కారణంగా మా తొలి సినిమాను ఇక్కడే చేశాం’ అని సాక్షి ధోని చెప్పారు. దర్శకుడు రమేష్‌ తమిళ్‌ మణి మాట్లాడుతూ, ‘అందరూ ఎంజారు చేసేలా ఉండే సినిమా. ఇది అందరి ఇళ్లలో ఉండే యూనివర్సల్‌ సమస్యతో తెరకెక్కింది. అందరికీ సినిమా కెనెక్ట్‌ అవుతుంది’ అని తెలిపారు.

Spread the love