పంటి నొప్పి బాధిస్తే…

పంటి నొప్పి బాధిస్తే...చాలా మందిని వేధించే సమస్య పంటి నొప్పి. దంతాలు పుచ్చిపోవడం, ఇన్ఫెక్షన్‌, దంతాల్లో పగుళ్లు రావడం, చిగుళ్ల వ్యాధులు తదితర కారణాల వల్ల పంటి నొప్పి వస్తుంది. ఒక్కసారి పంటి నొప్పి వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు. దీంతో బాధ భరించలేక చాలా మంది డాక్టర్‌ను ఆశ్రయిస్తుంటారు. ఈ కింది చిట్కాలు పాటించడం వల్ల పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
లవంగాలతో పంటి నొప్పికి ఉపశమనం పొందవచ్చు. లవంగాల్లో ఉండే యుగేనల్‌ అనే రసాయన పదార్థం తేలికపాటి మత్తును కలిగిస్తుంది. నొప్పి వచ్చే దంతం దగ్గర లవంగాన్ని ఉంచి కొద్దికొద్దిగా నమలడం వల్ల అందులోని నూనె విడుదలై పంటి నొప్పి తగ్గుముఖం పడుతుంది. మార్కెట్లో లభించే లవంగ నూనెను నొప్పి వచ్చే చోట రాసినా ఫలితం ఉంటుంది. లవంగం నూనెను నేరుగా రాయకుండా.. దూదిపై రెండు చుక్కలు వేసి నొప్పి వచ్చే దంతాలపై ఉంచాలి.
వేడి నీటిలో ఉప్పు వేసి కరిగాక పుక్కించాలి. ఇలా చేయడం వల్ల సహజ మైన యాంటి సెప్టిక్‌లా పని చేస్తుంది. కనీసం 30 సెకన్లపాటు ఉప్పు నీటిని పుక్కిలించాక ఉమ్మేయడం వల్ల దంతాల చుట్టూ పేరుకుపోయిన వ్యర్థాలు బయట కు వెళ్తాయి. ఇన్ఫెక్షన్‌ పెరగకుండా కూడా చూసుకోవచ్చు. రోజూలో వీలైనన్ని సార్లు ఇలా పుక్కిలించడం వల్ల సూక్ష్మ జీవులు నశించి నొప్పి తగ్గుముఖం పడుతుంది.
ఐస్‌ క్యూబ్‌లను ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో వేసి పలుచటి గుడ్డతో చుట్టాలి. నొప్పి పెట్టే పంటిపై ఈ బ్యాగ్‌తో నెమ్మదిగా ఒత్తడం వల్ల ఫలితం ఉంటుంది.
వెల్లుల్లిలో యాంటి బయోటిక్‌ గుణాలు అధికంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఇవి తీవ్రమైన పంటి నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. వెల్లుల్లిని దంచి.. టేబుల్‌ సాల్ట్‌ లేదా మిరియాలతో కలిపి నొప్పిని కలిగించే పంటిపై ఉంచడం వల్ల చక్కటి ఫలితం లభిస్తుంది.
రోజూ రెండుసార్లు బ్రష్‌ చేసుకోవడం, తీపి పదార్థాల జోలికి పోకపోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరీ చల్లగా ఉండే ద్రవాలను తాగకపోవడమే ఉత్తమం.

Spread the love