– మార్చి 19 వరకు నిర్వహణ
– ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్
– అదేనెల 19న పర్యావరణ విద్య పరీక్ష
– టైంటేబుల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వార్షిక పరీక్షలు-2024, ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు మార్చి 19 వరకు జరుగుతాయి. జనరల్తోపాటు ఒకేషనల్ విద్యార్థులకూ ఇదే షెడ్యూల్ వర్తించనుంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు నిర్వహిస్తారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా గురువారం పరీక్షల షెడ్యూల్ (టైంటేబుల్)ను విడుదల చేశారు. ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చేఏడాది ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలుంటాయని వివరించారు. ప్రతి రోజూ రెండువిడతల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండో విడత ప్రాక్టికల్ పరీక్షలుంటాయని తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలను ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 16న ఒక్కరోజే ఆ ప్రాక్టికల్ పరీక్షను నిర్వహిస్తామని షెడ్యూల్లో తెలిపారు. అదేనెల 17న ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నైతికత, మానవ విలువలు రాతపరీక్షఉంటుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 19న ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పర్యావరణ విద్య పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు.