– ఆలస్య రుసుంతో డిసెంబర్ 20 వరకు అవకాశం : ఇంటర్ బోర్డు
– స్వల్పంగా పెరిగిన ఫీజు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2024, మార్చిలో నిర్వహించే వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు వచ్చేనెల 14వ తేదీ వరకు ఉన్నది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ (జనరల్, ఒకేషనల్) రెగ్యులర్, ఫెయిలైన విద్యార్థులతోపాటు హాజరు మినహాయింపు ఉన్న ప్రయివేటు విద్యార్థులు సైతం ఫీజు చెల్లించాలని కోరారు. ఆలస్య రుసుం రూ.100తో నవంబర్ 16 నుంచి 23 వరకు, రూ.500తో అదేనెల 25 నుంచి వచ్చేనెల నాలుగు వరకు, రూ.వెయ్యితో ఆరు నుంచి 13 వరకు, రూ.రెండు వేలతో అదేనెల 15 నుంచి 20వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని పేర్కొన్నా రు. ఇంటర్ ప్రథమ సంవత్సరం థియరీ సబ్జెక్టులకు జనరల్ విద్యార్థులకు రూ.510, ఒకేషనల్ విద్యార్థులకు రూ.730 (థియరీకి రూ.510, ప్రాక్టికల్స్కు రూ.220) చెల్లించాలని వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులు థియరీ సబ్జెక్టులకు రూ.510, సైన్స్ విద్యార్థులు రూ.730 (థియరీకి రూ.510, ప్రాక్టికల్స్కు రూ.220) ఫీజు చెల్లించాలని తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు రూ.730 (థియరీకి రూ.510, ప్రాక్టికల్స్కు రూ.220) చెల్లించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు tsbie.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. అయితే గతేడాది కంటే ఈ ఏడాది పరీక్ష ఫీజు స్వల్పంగా పెరగడం గమనార్హం.